
విద్యార్థుల క్షేమం కోసం మండలంలోని కేశవరంకు చెందిన సామాజిక కార్యకర్త, టీడీపీ కార్యకర్త వల్లూరి శ్రీవాణి గత 53 రోజులుగా మౌన దీక్ష చేపట్టి శాంతియుతంగా పోరాటం కొనసాగిస్తున్నారు. తన వ్యక్తిగత ప్రయోజనం కోసం కాకుండా గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రహారీ గోడ నిర్మాణం కావాలన్నదే ఆమె ప్రధాన లక్ష్యంతో పోరాటానికి దిగారు. ఉదయం స్కూల్ మొదలయ్యే సమయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు, స్కూల్ గేటు వద్ద చాప వేసుకొని ఒంటరిగా కూర్చుని శ్రీవాణి దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ నిరసన చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులే కాదు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా ఆమె దీక్షకు మద్దతు తెలుపుతున్నారు. 60 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ పాఠశాలకు ఇప్పటికీ ప్రహారీ లేకపోవడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గ్రామానికి అనేక హామీలు ఇచ్చినా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అవన్నీ మరిచిపోయారని ఆరోపించారు. తాను టీడీపీ కార్యకర్తగా చాలా సంవత్సరాలుగా సేవలందిస్తున్నానని తెలిపారు. అమరావతి రైతుల కోసం 200 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అరెస్టు అయినప్పుడు అన్నవరం వరకు పాదయాత్ర చేసిన ఏకైక మహిళ తానేనని చెప్పారు. తాను పార్టీ పరంగా ఉన్నా, గ్రామాభివృద్ధి కోసం పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. 53 రోజులుగా దీక్ష చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే గానీ, అధికారులు గానీ స్పందించకపోవడం బాధాకరమన్నారు. దీంతో విద్యార్థులు, గ్రామస్తులు అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు ప్రహారీ గోడ నిర్మాణం జరిగే వరకు తన పోరాటం ఆగదని శ్రీవాణి స్పష్టం చేశారు.