
బక్రీదు (ఈదుల్ అజ్ హా) పండగను మతసామరస్యానికి ప్రతీకగా కుల, మతాలకు అతీతంగా సోదరభావంతో, శాంతియుతంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జూన్ 6న పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ముస్లిం సోదరులకు బక్రీద్ (ఈదుల్ అజ్ హా) పండగ శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – బక్రీద్ (ఈదుల్ అజ్ హా) పండగ భక్తికి ప్రతీకని, పండగను ముస్లిం సోదరులు మతసామరస్యంను పాటిస్తూ, శాంతియుతంగా నిర్వహించుకోవాలన్నారు. బక్రీద్ పండగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంబంధిత పోలీసు అధికారులు ముందస్తు భద్రత చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని మసీదుల వద్దకు బక్రీదు పండగ సందర్భంగా ముస్లిం సోదరులు సందర్శించి, ప్రత్యేక ప్రార్ధనలు చేపట్టే అవకాశం ఉన్నందున మసీదుల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమైన మసీదుల
వద్ద డ్రోన్స్, సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ పోలీసు స్టేషను పరిధిలోని మసీదులను కవర్ చేస్తూ పెట్రోలింగు నిర్వహించే విధంగా భద్రత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు, ఇతర వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాహనాల పార్కింగు చేసుకోవాలన్నారు. మతసామరస్యానికి ఎటువంటి విఘాతం కలగకుండా ప్రతీ ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ, సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ముస్లిం-హిందువుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే సామాజిక మాధ్యమాల్లో ప్రచారమయ్యే అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు. మతాలు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులు లేదా వస్తువులు కనబడితే సమాచారాన్ని డయల్ 112 లేదా స్థానిక పోలీసులకు అందించాలని
ప్రజలకు జిల్లా ఎస్పీ నకుల్ జిందల్ పిలుపునిచ్చారు.
బక్రీద్ పండగ ప్రశాంతయుతంగా ముగిసే విధంగా భద్రత చర్యలు చేపట్టాలని, భద్రత ఏర్పాట్లను సంబంధిత డీఎస్పీలు, సిఐలు పర్యవేక్షించాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.