
సీనియర్ జర్నలిస్టు, 10టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎం.ఎం.ఎల్. నాయుడుపై విజయనగరం టూ టౌన్ ఎస్ఐ ఎస్. మురళి దురుసుగా ప్రవర్తించిన ఘటనపై గుమ్మలక్ష్మీపురం ప్రెస్ క్లబ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రెస్ క్లబ్ సభ్యులు గుమ్మలక్ష్మీపురం ఎమ్మార్వో శేఖర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీడియా ప్రతినిధులపై పోలీసుల దురుసు ప్రవర్తనను ఖండించి, ఎస్.ఐ మురళిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వార్త సేకరణ సమయంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇలాంటి దౌర్జన్యాలను సహించబోమని స్పష్టం చేశారు. “మీడియా స్వేచ్ఛను హరించే ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని తెలిపారు. ఈ సంఘటన పోలీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా ఉందని అన్నారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఎమర్వోను కోరారు. దీనిలో ఎన్ టీవీ రిపోర్టర్ టి.వినోద్, 99టివి రిపోర్టర్ పాలక ప్రేమానందు, మైత్రి మీడియా రిపోర్టర్ ఏం నాని, భారత్ ఎక్స్ప్రెస్ రిపోర్టర్ కిరణ్, 1టివి రిపోర్టర్ కిషోర్, 10టివి రిపోర్టర్ రాజా పాల్గొన్నారు.