
ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం సాగర
తీరంలో పెద్ద ఎత్తున చేపడుతున్న యోగాంధ్ర కార్యక్రమంలో దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొననున్న నేపథ్యంలో విశాఖ ఐటి సెజ్ నుండి కాపుల ఉప్పాడ వరకు ఏర్పాటు చేసిన 59 కంపార్టుమెంట్లులో విస్తృత స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమానికి బందోబస్తు, భద్రత విధులు నిర్వహించేందుకు నియమించబడిన పోలీసు అధికారులు, సిబ్బందితో రుషికొండ ఎ-1 ఫంక్షన్ హాలులో సమావేశమై, వారు నిర్వహించాల్సిన విధుల గురించి దిశా నిర్ధేశం చేసారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ మాట్లాడుతూ – యోగాంధ్ర కార్యక్రమ నిర్వహణలో ఎటువంటి
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు, భద్రత విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలన్నారు. విశాఖ ఐటి సెజ్ నుండి కాపుల ఉప్పాడ వరకు ఏర్పాటు చేసిన 59 కంపార్టుమెంట్లలో ప్రజలు చేరుకొనే విధంగా చూడాలన్నారు. యోగాంధ్ర కార్యక్రమంకు ప్రజలు బస్సుల్లో చేరుకొంటున్నందున
ఆయా బస్సులను వారికి కేటాయించిన పార్కింగు స్థలాల్లోకి పార్కింగు చేసుకొనే విధంగా ఇతర అధికారులతో సమన్వయంతో పని చేయాలన్నారు. ట్రాఫిక్ ఎటువంటి అవాంతరాలు జరగకుండా ట్రాఫిక్ రెగ్యులేషను చేయాలని అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ దిశా నిర్ధేశం చేసారు. ముఖ్య వ్యక్తుల భద్రత దృష్ట్యా జిల్లా మీదుగా విశాఖపట్నం వెళ్ళే కొత్తవలస మండలం చింతలపాలెం, డెంకాడ మండలం రాజాపులోవ వద్ద రెండు చెక్ పోస్టులను ఏర్పాటు చేసామన్నారు. ఈ చెక్ పోస్టులు వద్ద నిరంతరం వాహన తనిఖీలు చేపట్టే విధంగా చర్యలు చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎఆర్ ఎస్పీ అశోక్ కుమార్, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, పలువురు డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.