
విజయనగరం జిల్లా ఎస్.కోట పోలీసు స్టేషను పరిధిలో నమోదైన గంజాయి కేసులో నిందితుడిగా అరెస్టుకాబడిన గంజాయి వ్యాపారి అయిన ఒడిస్సా రాష్ట్రం, కోరాపుట్ జిల్లా నందపూర్ మండలం, బసుపుట్ గ్రామం, సోబాపుట్ వార్డుకు చెందిన పతి ఖిల అలియాస్ గురు (32 సం.లు)కు చెందిన రూ.42,70,000/- ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జూన్ 12న తెలిపారు.
ఒడిస్సా రాష్ట్రం, కోరాపుట్ జిల్లా నందపూర్ మండలం, బసుపుట్ గ్రామం, సోబాపుట్ వార్డుకు చెందిన పతిఖిల అలియాస్ గురు (32 సం.లు) ఆదేశాలతో ఇద్దరు వ్యక్తులు 200కిలోల గంజాయిని అక్టోబరు 6, 2024న తరలిస్తూ ఎస్.కోట పట్టణం పందిరప్పన్న జంక్షన్ వద్ద ఎస్.కోట పోలీసులకు పట్టుబడ్డారన్నారు. పట్టుబడిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు గంజాయి అక్రమ రవాణకు కారకులైన ప్రధాన నిందితుడిగా పతి ఖిల అలియాస్ గురును ఎస్.కోట పోలీసులు గుర్తించి, అతడిని అక్టోబరు 10, 2024న అరెస్టు చేసి, విశాఖపట్నం సెంట్రల్ జైలుకు రిమాండు నిమిత్తం తరలించారన్నారు. విచారణలో నిందితుడు పతి ఖిల అలియాస్ గురు గత కొన్ని సంవత్సరాలుగా గంజాయి అక్రమ రవాణ చేస్తూ, వివిధ ప్రాంతాలకు గంజాయిని తరలిస్తున్నట్లు, వచ్చిన అక్రమ సంపాదనతో రూ.42,70,000/-
ల విలువైన స్థిర, చరాస్థులను సంపాదించినట్లుగా గుర్తించామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఇటీవల ప్రభుత్వం గంజాయి అక్రమ రవాణను నియంత్రించుటలో భాగంగా గంజాయి వ్యాపారంతో కూడబెట్టిన అక్రమ ఆస్తులను అటాచ్ చేయాలని నిర్ణయించి, ఉత్తర్వులు జారీ చేయడంతో, చర్యలకు ఉపక్రమించామన్నారు.
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఇచ్చిన ఆదేశాలతో ఎస్.కోట ఇన్స్పెక్టరు వి.నారాయణమూర్తి ఈ కేసులో మరింత
లోతైన విచారణ చేపట్టి, నిందితుడు పతి ఖిల అలియాస్ గురు కోరాపుట్ జిల్లా సోబాపుట్లో రూ.40 లక్షల విలువైన 10 సెంట్ల స్థలంలో ఇంటిని నిర్మించినట్లుగా గుర్తించామన్నారు. అదే విధంగా రూ.1.50 లక్షల విలువైన ఎపి 31 టిజి
4002 నంబరు గల ఆటో మరియు రూ.1.20 లక్షల విలువైన ఒడి 10వి 6297 నంబరు గల టివిఎస్ అపాచె మోటారు సైకిలును కొనుగోలు చేసినట్లుగా గుర్తించామన్నారు. అంతేకాకుండా, సునాబెడలోని స్టేట్ బ్యాంకు ఆఫ్
ఇండియా బ్యాంకు ఖాతకు ఏప్రిల్ 21, 2023న రూ.38,28,816/ల నగదు జమయినట్లుగా గుర్తించామన్నారు. ఇవికాకుండా గంజాయి వ్యాపారుల నుండి పతి ఖిల అలియాస్ గురు బ్యాంకు ఖాతాకు పలుమార్లు రూ.6.87 లక్షల నగదు జమ అయినట్లు, నగదు బదిలీ చేసిన వ్యక్తులు కూడా గంజాయి వ్యాపారాలు సాగిస్తూ, పోలీసులకు పట్టుబడిన వారేనని,
వారిపై కూడా రాజస్థాన్, మహారాష్ట్ర, అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి అక్రమ రవాణ కేసులు ఉన్నట్లుగా
గుర్తించామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
నిందితుడు పతి ఖిల అలియాస్ గురు (32 సం.లు) గంజాయి అక్రమ రవాణను లాభసాటి వ్యాపారంగా భావించి, గంజాయి అక్రమ రవాణకు పాల్పడుతున్నట్లుగా గుర్తించినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. విచారణలో భాగంగా
జిల్లా ఎస్పీ వకుల్ ఉందల్, అదనపు ఎస్పీ పి. సౌమ్యలత ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, పలు రికార్డులను,
డాక్యుమెంట్లును తనిఖీ చేసి, నిందితుడు పతి ఖిల అలియాస్ గురు గత కొన్ని సంవత్సరాల్లో ఇంటిని నిర్మించి, ఆటో, మోటారు సైకిలును కొనుగోలు చేసినట్లు, సంపాదించిన అక్రమ ఆస్తుల విలువ రూ.42.70 లక్షలు ఉంటుందని,
నిందితుడి అక్రమ ఆస్తులను ఎవరికీ విక్రయించకుండా చట్ట పరిధిలో ఫ్రీజ్ చేసినట్లుగా నోటీసులు కూడా జారీ చేసామన్నారు. ఫ్రీజ్ చేసిన ఆస్తులు కోలకతాలోని కాంపింటెంట్ అధారిటీ పరిధిలోకి వెళ్ళిపోయినట్లు, సదరు ఆస్తులను ఎవరి కొనుగోలు చేసినా, చెల్లనేరమని, ప్రజలు గమనించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ ప్రక్రియలో
క్రియాశీలకంగా పని చేసిన అదనపు ఎస్పీ పి. సౌమ్యలత, ఎస్.కోట ఇన్స్పెక్టరు వి.నారాయణమూర్తి మరియు ఇతర పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు.