
మెంటాడ, న్యూస్: వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని రైతు సంక్షేమంతోనే రాష్ట్ర సస్యశ్యామలమవుతుందని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం ఇద్దన వలస గ్రామంలో రాయితీపై విత్తనాలు పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు కన్నీళ్లు రాష్ట్రానికి చేటు అని రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఈ నేపథ్యంలోనే రైతు సంతోషం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తుందని విత్తనాలు మొదలుకొని యంత్ర పరికరాల వరకు రాయితీపై అందజేస్తుందని రైతుకు లాభసాటిగా ఆరోగ్యకరంగా ఉండేలాగున వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టిందని దానిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సంప్రదాయ వ్యవసాయాన్ని కొనసాగిస్తూనే సాంకేతికతను అందుకోవాలని తెలిపారు. దీనివల్ల సమయం ,డబ్బు ఆదా అవుతుంది అని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం వలన నిధుల సమస్య ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో శిధిలమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలుచేస్తామని పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే లోపు తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్న 15,000/లు రూపాయలు చొప్పున తల్లుల ఖాతాలో జమ చేస్తారని ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నట్లు తెలిపారు. జూన్ నెలాఖరు నాటికి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులతో పాటు కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఆండ్ర రిజర్వాయర్ అభివృద్ధికి కోటి 50 లక్షలు, గర్ల మినీ రిజర్వాయర్, ఆండ్ర ఎడమ కాలువ పూర్తి చేయటానికి 50 లక్షలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి రామారావు మాట్లాడుతూ విత్తన కొరత తలత్తే అవకాశం లేదని ఎన్నడూ లేని విధంగా విత్తనాలు, ఎరువులు సమకూరుస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు చలుమూరి వెంకట్రావు, టిడిపి నాయకులు గెద్ద అన్నవరం, రెడ్డి ఆదినారాయణ, సర్పంచ్ రామారావు, రెడ్డి సత్యనారాయణ, ఎంపీడీవో భానుమూర్తి, మండల వ్యవసాయ అధికారి గోకుల్ కృష్ణ, ఇతర మండల స్థాయి అధికారులు, టిడిపి కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.