
ప్రజల అవగాహన లోపం కారణంగా ప్రజలు సైబరు మోసాలకు గురవుతున్నారని, ఇటువంటి సైబరు
మోసగాళ్ళు, వారు చెప్పే మాయ మాటలు పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జూన్ 1న పిలుపునిచ్చారు.
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్ మాట్లాడుతూ – సైబరు మోసాల నియంత్రణలో వ్యక్తిగత
సమాచారం, బ్యాంకింగు వివరాలు, ఓ.టి.పి.లు, పాస్వర్డులు లాంటి అంశాలను హ్యాకర్లు లేదా సైబరు మోసగాళ్ళు
దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున, వాటి వివరాలను ఎప్పుడు ఇతరులతో పంచుకోవద్దన్నారు. కొంతమంది
మోసగాళ్ళు ఆరోగ్య బీమా సొమ్మును కాజేందుకు కొత్త పంధాలను అనుసరిస్తూ, మోసాలకు పాల్పడుతున్నారన్నారు. అనారోగ్య సమయాల్లో ఆర్ధిక రక్షణ పొందేందుకు చాలామంది ఆరోగ్య బీమా ప్రీమియంలు చెల్లిస్తుంటారు. ఈ తరహా ప్రీమియమ్స్ చెల్లించడం వలన అనుకోని పరిస్థితుల్లో పాలసీదారుడు ఆసుపత్రిలో చేరితే నిర్ణీత మొత్తం వరకూ బీమాసంస్థ భరిస్తుందన్నారు. కానీ, కొంతమంది మోసగాళ్ళు ఎలాంటి క్లైయిమ్స్ చేయని పాలసీదారులను లక్ష్యంగా చేసుకొని,
మోసపూరితంగా క్లైయిమ్స్ చేయించి, బీమా పాలసీ నుండి డబ్బులు తీసుకుంటున్నారన్నారు. చెల్లించిన బీమా ప్రీమియం
వృధా అయిపోతుందని, ఎందుకు వదిలేయాలని చెబుతూ ముందుగా పాలసీదారులకు ఫోను చేసి, ఏదో ఒక విధంగా తాము క్లైయిమ్ చేస్తామని పాలసీదారులను ఒప్పిస్తారన్నారు. పాలసీదారుల వివరాలతో ఇతర వ్యక్తులను ఆసుపత్రిలో
చేర్పించి, వారికి చికిత్స అందిస్తున్నట్లుగా ఇతర ఆధారాలను సృష్టించి, బీమా సంస్థల నుండి డబ్బులను రాబట్టి,
పరారవుతారన్నారు. పాలసీదారులకు నిజంగా ఆరోగ్య బీమా పాలసీ అవసరమై, ఆసుపత్రిలో చేరే సమయాల్లో వారికి
అసలైన ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ఇలాంటి పరిస్థితులు ఎవరికైనా ఎదురైతే వెంటనే బీమాసంస్థను సంప్రదించాలన్నారు. కావున, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని, మోసగాళ్ళ మాయ మాటలకు లొంగిపోవద్దన్నారు. అదేవిధంగా గుర్తు తెలియని లింకులు లేదా అప్లికేషన్లను క్లిక్ చేయవద్దని, ఎవరైనా వ్యక్తిగత సమాచాంను ఫోను ద్వారా అడిగితే ఇవ్వవద్దని, శంకాస్పద వెబ్ సైట్లను వినియోగించ వద్దని ప్రజలకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు.
ఎవరైనా సైబరు మోసానికి గురైతే సైబరు క్రైమ్ హెల్ప్ లైను 1980 లేదా www.cybercrime.gov.in అనే సైబరు క్రైం పోర్టల్లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పిలుపునిచ్చారు.