
విజయనగరం ఉగ్ర లింక్ బయటపడడంతో విజయనగరం ఉలికిపడింది. పేలుళ్లకి ఇక్కడే పన్నాగం పన్నారని తెలుసుకుని భయాందోళనకు గురయ్యింది. స్థానిక యువకుడే ఓ గ్రూపుని నడుపుతున్నాడని వెలుగుచూడడంతో విస్తుబోయింది. ఎప్పుడూ లేనిది, ఎన్నడూ కననది, ఊహ? కూడా రాని… అలాంటి సందర్భం తటస్థించడంతో బిక్కచచ్చిపోయింది. ముస్లిమేతురులనే లక్ష్యం చేసుకున్నారని తెలిసి భయంతో గజగజలాడింది. ఎవరు ఎలాంటి వారో గుర్తించడం ఎలా అని భీతిల్లుతోంది. ఒక పక్క ఈ భయానిక వాతావరణం అలముకుని ఉంది. మరో పక్క ఈ ఉగ్ర లింక్ ఎలా ఏర్పడింది? అన్న ప్రశ్నకి బదులు వెతికేందుకు పోలీస్ అధికార వర్గం వివిధ కోణాలలో శోధిస్తూనే ఉంది. గడిచిన అయిదు రోజులుగా ఎఫ్్వఆర్ లో సిరాజ్ ఇచ్చిన వివరాలను పరిగణనలోనికి తీసుకుని తగిన ఆధారాలను సేకరించింది. సీన్ క్రియేషన్ కి అవసరమైన స్థలాలన్నింటినీ గుర్తించింది. కుటుంబ సభ్యుల నుంచి, స్నేహితుల నుంచి పలు వివరాలను సేకరించింది. కీలకమైన తదుపరి విచారణ కోసం కస్టడీ కోసం కోర్టుని ఆశ్రయించింది. ఆ మేరకు పోలీస్ కస్టడీకి నింధితులను అప్పగించాలని ఆదేశించింది. ఆ మేరకు మలివిడత విచారణకు మార్గం సుగుమం అయినట్ల అయ్యింది.
వారం రోజులు పాటు కస్టడీ
పక్కా సమాచారంతో ఈ నెల 16వ తేదీన విజయనగరం టూటౌన్ పోలీసులు రాజానగర్ వద్ద ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. బైక్ మీద ఒక సంచితో సిరాజ్ అటుగా వచ్చాడు. ఆపి తనిఖీ చేశారు. సంచిలో కొన్ని అనుమానించదగ్గ వస్తువులు బయటపడ్డాయి. దీంతో అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరిపారు. పేలుళ్ల కోసం సామాగ్రిని సమకూర్చినట్లు నింధితుడు ఒప్పుకున్నాడు. ఆ మేరకు సమీర్ ని కూడా హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయనగరం తీసుకుని వచ్చారు. 17వ తేదీన కోర్టులో హాజరుపరిచారు. జ్యూడిషియల్ రిమాండ్ విధించారు. ఆ మేరకు విశాఖ సెంట్రల్ జైలుకి తరలించారు. అయితే. ఉగ్రలింక్ లతో కూడిన కేసు కావడంతో కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో సిటీషన్ వేశారు. దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టే వ్యూహం ఈ కేసులో ఇమిడి ఉన్నందున మరింత సమాచారాన్ని సేకరించేందుకు కస్టడీని కోరారు. వాదోపవాదాలు విన్న కోర్టు ఏడు రోజులు పాటు కస్టడీకి ఇచ్చేందుకు అనుమతించింది. థర్డ్ డిగ్రీని ప్రయోగించడానికి వీలు లేదని స్పష్టం చేసింది. విచారణకు ముందు. విచారణ తరువాత కూడా వైద్య పరీక్షలు చేయించి కోర్టుకి అప్పగించాలని సూచించింది. ఆ మేరకు నింధితులు సిరాజ్, సమీర్ లను విశాఖ సెంట్రల్ జైలు నుంచి ఈ ఉదయం తమ కస్టడీకి పోలీసులు తీసుకున్నారు. అక్కడ నుంచి నేరుగా విజయనగరం తీసుకుని వచ్చారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య అత్యంత రహస్య ప్రదేశంలో విచారణను చేపట్టేందుకు సిద్ధపడుతున్నారు.
ఉగ్రలింక్ ఎలా ఏర్పడింది?
ఎస్ఐఐఆర్ లో సిరాజ్ ఒప్పుకున్న అంశాలలో కీలకమైంది… ఒక గ్రూపు ఏర్పాటు. దేశ వ్యాపితంగా యువకులతో ఈ గ్రూపుని ఏర్పాటు చేయడంలో రెండు లక్ష్యాల అని ఇప్పటికే చెప్పి ఉన్నాడు. ఒకటి ముస్లిం మహిళలను ప్రేమ పేరితో ముస్లిమేతరులు మోసగించడం, ముస్లింలను అవమానించడం, ముస్లిం మతాన్ని కించపరచడం వంటి భావించినట్లు చెప్పాడు. వాటికి వ్యతిరేకంగా పనిచేయాలని అందుకు బీహార్ కి చెందిన వ్యక్తి సౌదీ నుంచి ఆర్ధిక సహకారం అందించేందుకు ముందుకు వచ్చినట్లు తేలింది. హైదరాబాద్ లోనూ, ముంబాయిలోనూ కొన్ని సార్లు ప్రత్యక్షంగానూ, మరి కొన్ని సార్లు యాప్ ద్వారానూ సమావేశం అయ్యారు. ఏహెచ్ఐఎం సంస్థ ద్వారా ఈ గ్రూపు తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు ప్రాథమికంగా సమాచారాన్ని సేకరించారు. ఇప్పుడు ఆ గ్రూపు ఎవరు స్థాపించారు. ఎక్కడ స్థాపించారు. ఎవరు ఈ గ్రూపుని నడుపుతున్న ప్రధాన వ్యక్తి ఎవరు అన్నది నిగ్గు తేల్చేందుకు ఎన్ఐఎ తన దృష్టిని కేంద్రీకరించింది. ఈ సంస్థకేమైనా అంతర్జాతీయ సంస్థలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఉంటే ఏ సంస్థతో అన్నది తేల్చడమే ఈ కేసులో కీలకమైంది. ఆ దిశగా విచారణ సాగే అవకాశం ఉంది. ఈ సంస్థ ఎక్కడెక్కడ ఉంది. ఎంత మంది సభ్యులు ఉన్నారు. వారి దిన చర్యలు ఏమిటి అన్నది కూడా రాబట్టనున్నారు. మొత్తం చెప్పుకుంటే ఎహెచ్ఐఎం సంస్థకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని రాబట్టడం, వాటిని ఇతర సంస్థలతో ఉన్న సంబంధాన్ని సాధికారికంగా తేల్చే పని
కొనసాగనుంది. సిరాజ్ అటువైపు ఎలా ఆకర్షితుడయ్యాడు?
సిరాజ్ కుటుంబం పోలీస్ కుటుంబం, తన తండ్రి ప్రస్తుతం విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎఎస్ ఐ గా పనిచేస్తున్నారు. అన్న కూడా పోలీస్ విభాగంలోనే ఉన్నాడు. ఆర్థిక పరిస్థితి రీత్యా చూసినప్పుడు మెరుగైన స్థితే, అలానే చదువు రీత్యా కూడా సిరాజ్ ఉన్నతుడే. మెకానికల్ ఇంజినీరింగ్ ని పూర్తి చేశాడు. పోలీస్ అధికారి కావాలని కలగన్నాడు. అందుకోసం హైదరాబాద్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు. అంతేకాకుండా 108 కాల్ సెంటర్ లో పనిచేశాడు. అటువంటి యువకుడు హైదరాబాద్ ఉండగా ఎహెచ్ఎఐఎం సంబంధాలలోకి ఎలా వెళ్లాడన్నది అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా విజయనగరంలో తల్లిదండ్రలు చెంతనే ఉంటూ ఈ వ్యవహారాలను ఏ విధంగా చక్కబెడుతున్నాడన్నది మరో అంశం, సిరాజ్ లో ఈ భావజాలానికి ఎక్కించింది ఎక్కడ అన్న మూలస్థానాన్ని కనుగొనే పనిలో పోలీసులు ఇప్పుడు ఉన్నారు. ఆ మూల స్థానాన్ని గుర్తించడం ద్వారా ఇంకెంత మంది యువకులు ఇందులో ఉన్నారో తేల్చే అవకాశం ముడిపడి ఉందని చెప్పకతప్పదు. ఇప్పటికి సిరాజ్ ఇచ్చిన సమాచారం ప్రకారం సది మంది వరకూ ఈ గ్రూపులో ఉన్నట్లు స్పష్టమవుతుంది. అలానే బెంగుళూరు, మహారాష్ట్రాలకి చెందిన వారు ఉన్నట్ల కూడా తేలింది. ఇంకెవరు ఉన్నారన్నది ఇంకా తేలాల్సి ఉంది.
ఆర్థిక మూలాల మీద దృష్టి
ఒక గ్రూపుగా కలవడం, చర్చించడం వంటివి ఏడాది క్రితమే ప్రారంభమయ్యింది. కాల్ సెంటర్ లోపనిచేస్తూ ఉండడం, అంతకపూర్వం హైదరాబాద్ లో చదువునిమిత్తం నివాసం ఉండడం వంటి సందర్భాలలో సమీర్ తో స్నేహం ఏర్పడడం, అలానే, వరంగల్ చెందిన మొహిద్దీన్, ఉత్తరప్రదేశ్ చెందిన బాబర్ తో పరిచయాలు అయ్యాయి. వీళ్లు నిత్యం కలవడం, ముస్లిం మతం గురించి, పలువురి ప్రసంగాల గురించి చర్చించుకోవడం జరుగుతూ వచ్చిందని, ఆ కోణంలోనే ఈ గ్రూపు ఏర్పడినట్లు ప్రాథమికంగా పోలీసులు సమాచారాన్ని రాబట్టారు. అయితే, నలుగురు వ్యక్తులతో ఏర్పడిన ఈ బృందం ఓ పది మంది వరకూ ప్రత్యక్షంగా సమావేశం నిర్వహించే స్థాయికి ఎదగడం పట్ల నిఘా వర్గాలు దృష్టిని కేంద్రీకరించాయి. ఏ విధంగా ఈ గ్రూపు ఏర్పడింది. వీళ్ల కార్యకలాపాలకి ఆర్ధిక సహకారం ఎవరు ఇస్తున్నారు అన్నది తేల్చాల్సి ఉంది. ఆ దిశగా ఇప్పటికే ఎన్ఐఎ, విజయనగరం పోలీసులు దర్యాప్తును చేపట్టారు. సిరాజ్ కుటుంబీకుల బ్యాంకు ఖాతాల వివరాలన్నింటినీ సేకరించారు. ఈ మధ్య కాలంలో పెద్ద మొత్తంలో ఏమైన అమౌంట్ పడిందా లేదా అన్నది శోధిస్తున్నారు. అలానే, డిసిసిబిలో ఉన్న లాకర్ ని తెరిపించారు. కొంత మేర సమాచారాన్ని రాబట్టారు. ప్రస్తుతానికి బ్యాంకు లావాదేవీలన్నింటినీ స్తంభింపజేశారు. ఇప్పటి వరకూ సేకరించిన వివరాల ఆధారంగా కూడా సిరాజ్ ని. సమీర్ ని ప్రశ్నించే అవకాశం లేకపోలేదు.
మొత్తానికి ఈ కేసులో దర్యాప్తు కీలకదశకు రానుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకూ సిరాజ్, సమీర్ ఇచ్చింది ప్రాథమిక సమాచారం మాత్రమే. వాటి ఆధారంగానే అటు కేంద్ర బృందాలు, ఇటు ఉమ్మడి రాష్ట్ర నిఘా బృందాలు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఒక పక్క హైదరాబాద్ లోనూ, మరో పక్క విజయనగరంలోనూ ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారాన్ని సేకరించే పనిని వేగవంతం చేశారు. అలానే సిరాజ్ కొనుగోలు చేసిన పేలుడు పదార్థాలకు సంబంధించిన మరెన్ని వివరాలను సేకరించేందుకు మరో బృందం మోహరింపబడింది. ఇలా వివిధ కోణాలలో ఈ కేసును విచారిస్తున్నారు. నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు ఈ వారం రోజులు కస్టడీ అత్యంత కీలకం కానుంది. ఈ విచారణలో ఇంకెన్ని విస్తుబోయే అంశాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి.