
విజయనగరం :
సీనియర్ జర్నలిస్ట్, 10టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎం.ఎం.ఎల్.నాయుడుపై విజయనగరం టూ టౌన్ ఎస్.ఐ మురళి చేసిన దౌర్జన్యాన్ని పూల్ బాగ్ అయ్యప్పనగర్ కాలనీ పోరాట సమితి తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆదివారం పలువురు కమిటీ సభ్యులు జర్నలిస్ట్ నాయుడు ని కలిసి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ,
అయ్యప్పనగర్ లో నివాసం ఉంటున్న రిటైర్డ్ డీఈవో ఎస్. అప్పలనాయుడుపై జరిగిన హత్యాయత్నం కు సంబంధించి జర్నలిస్ట్ నాయుడు తన మొబైల్ ఫోన్ లో విజువల్స్ తీస్తుండగా, టూ టౌన్ ఎస్.ఐ మురళి దౌర్జన్యం చేసి ఫోన్ లాక్కున్నారని, అంతటితో ఆగకుండా తీవ్ర పదజాలంతో దుర్భాశలాడారు. ఇలా, ఒక పోలీస్ అధికారి సీనియర్ జర్నలిస్టు పై దౌర్జన్యం చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. రెండు దశాబ్దాలు పైగా జర్నలిస్టుగా, జర్నలిస్ట్ సంఘం నాయకుడుగా నాయుడు జిల్లాలో సేవలు అందిస్తూ, జిల్లాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని, అటువంటి ఆయనపై ఎస్.ఐ దౌర్జన్యం చేయడం దారుణమన్నారు. వెంటనే సదరు ఎస్.ఐ మురళిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే జర్నలిస్ట్ నాయుడుకి మద్దతుగా పోరాటం ఉదృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో కమిటీ అద్యక్షులు సుదర్శనరావు, సెక్రటరీ ఎన్.సుధీర్, యూ.ఎస్.రవికుమార్ (సీఐటీయూ జిల్లా సెక్రెటరీ), అచ్యుమాంబ (హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యులు) ఎం. మోహన్ రావు ( అడ్వకేట్), కె.వరప్రసాద్, ఆదినారాయణ రావు, రిటైర్డ్ టీచర్, శ్రీనివాసరావు (హేమశ్రీ కన్స్ట్రక్షన్), రెడ్డిగారు, సంతోష్, మహేష్, నారాయణరావు (అయ్యప్ప టవర్స్) పాల్గొన్నారు.