
విజయనగరం: విజయ నగరం జిల్లా బొండపల్లి మండలంలోని నెలివాడ గ్రామంలో ఉన్న రాజు చెరువు కబ్జా పై చర్యలు తీసుకోవాలని జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు తాళ్లపూడి కృష్ణ విజప్తి చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన గ్రీవెన్స్ కు పలువురి తో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ హెచ్ 26 తారు రోడ్డు ను అనుకుని సర్వే నంబర్ 6 లో ఏ 67.80 సెంట్లు విస్తీర్ణంలో ఉన్న రాజు చెరువు కొందరు ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. దీంతో చెరువు ఆయకట్టు కింద ఉన్న 480 ఎకరాలు , మిగులు జలాలు కెరటం, బిల్లలవలస,టెక్కలి, తుమ్మలి పేట , బూరడ పేట, చింతలి పేట తదితర గ్రామాలకు సాగునీరు అందుతుందని అన్నారు. 1980 సర్వే సెటిల్ మెంట్ లో ఏ 67.80 సెంట్లు ఉండగా ప్రస్తుతం ఏ 16.00 సెంట్లు గరుడబిల్లి గ్రామస్తుల ఆక్రమణ లో ఉందని ఇటీవల 10 రోజుల నుంచి చెరువు గర్భంలో 40 అడుగుల వెడల్పు గల రోడ్డు ను రియల్ ఎస్టేట్ వ్యాపారి చేపడుతున్నారని వెంటనే ఉన్నతాధికారులు పరిశీలించి చెరువు ఆక్రమణ ను నిలుపుదల చేసి అందుకు అనుమతినిచ్చిన అధికారుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.