*కూటమి పాలనలో పెద్దలకి పరమాన్నం, పేదలకి గంజి నీళ్ళు అన్నచందంగా కార్పొరేట్లకి కారుచౌకగా భూములు.* *వాతావరణ కాలుష్యం లేకుండా, ప్రజలకి ఉపాధికల్పించే పరిశ్రమలకి సిపిఐ వ్యతిరేకం కాదు.*

-సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి కామేశ్వరరావు.

 

 

కాంగ్రెస్, తెలుగుదేశం, వైసిపి నేటీ కూటమి ప్రభుత్వాలు గత 20 ఏళ్ళుగా కాగినిజెంట్, టీసీఎస్, జిందాల్ లాంటి కంపెనీలకి కారుచౌకగా భూములను కట్టబెడుతున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి కామేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోమవారం ఉదయం సిపిఐ జిల్లా కార్యాలయం డి.ఎన్.ఆర్ అమర్ భవన్ లో మీడియాకి ప్రకటన విడుదల చేసిన సందర్భంగా కామేశ్వరరావు మాట్లాడుతూ కోనేటి రంగారావు భూకమిటీ సిఫార్సులను అనుసరించి నాటి నుంచి నేటి వరకు ఎక్కడా ఎకరా భూమి కూడా పేద రైతులకి, పేదలకి 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చిన దాఖలాలు లేవని మండిపడ్డారు. భూములలో సాగు చేసుకుంటున్న రైతులను, నివాసం ఉంటున్న పేదలను తొలగించడమే కానీ పెదాలకి భూమి ఇవ్వడానికి చేతులు రాని ప్రభుత్వాలకి కార్పొరేట్లకి మాత్రం వేలాది ఎకరాలు భూమిని కారుచౌకగా కట్టబెట్టేస్తున్నారని విమర్శించారు.
విజయనగరం జిల్లాలో ఎస్. కోట నియోజవర్గంలో బౌడార ప్రాంతంలో అనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 1100 ఎకరాల్లో 900 ఎకరాలు ప్రభుత్వ భూమిని జిందాల్ కంపెనీకి ఇవ్వతలపెట్టి బాక్సైట్ శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని తలంపుతో ఆనాటి జిల్లా జాయింట్ కలెక్టర్ జగన్మోహన్ రావు నేతృత్వంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిందన్నారు గుర్తు చేశారు. ప్రస్తుత ఉన్నా జిల్ల కలెక్టర్ ఇటీవల కాలంలో మీడియాలో ఏ ప్రభుత్వము భూసేకరణ జరపలేదని మాట్లాడారు భూసేకరణ చేయకుంటే ప్రజాభిప్రాయం ఎందుకు జరిగిందో నేడున్న కలెక్టర్ గారు సమాధానం చెప్పాలన్నారు. ఆనాడు బాక్సైట్ శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేసే తాటిపూడి లాంటి నదీ జలాలు కలుషితం అవుతాయని దీని వలన ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని అరకు, అనంతగిరి మండలాల్లోని బాక్సైట్ ను తవ్వి వెలికి తీస్తే జీవనదులు నశిస్తాయని గిరిజనుల బతుకులు చిన్నాభిన్నం అవుతాయని సిపిఐ తదితర వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎన్నో పోరాటాలు చేశామని తెలిపారు. ఆనాడు ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న సిపిఐ తదితర వామపక్ష పార్టీల, ప్రజా సంఘాల నాయకులను ఆనాటి అధికార పార్టీ పాలకులు పోలీసులను ఉపయోగించి అక్రమంగా అరెస్టు చేయించి జైలుపాలు చేసి చీకటి కోణంలో భూములను లాక్కొని జిందాల్ కంపెనీకి కట్టబెట్టారని గుర్తు చేశారు.
జిందాల్ కి కేటాయించిన భూముల్లో ఎమ్.ఎస్.ఎమ్.ఇ పార్కులకి సిపిఐ వ్యతిరేకం కాదు కానీ 2007 లో ఎకరాకి ఇచ్చిన 4 లక్షల 10 వేలు కాకుండా నేడు అక్కడ పలుకుతున్న ధరలకి అనుగుణంగా ధర పెంచి ఇప్పించాల్సిన భాధ్యత ప్రభుత్వం పైనే ఉన్నదన్నారు. అదేవిధంగా భూమి పై ఉన్న సాగుదారులకి కూడా పరిహారం ఇప్పించాల్సిన భాధ్యత కూడా ప్రభుత్వం ఉన్నదన్నారు. తాటిపూడి రిజర్వాయర్ నీటిని ప్రాజక్టు నిర్మాణం చేసిన 20 ఏళ్ళ తర్వాత కేవలం ఎస్. కోట నియోజకవర్గంలో ప్రజలకి త్రాగు, సాగు నీటికే ఉపయోగిస్తామని ఆనాటి పెద్దలకి ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలని నేడున్న పరిశ్రమలతో పాటు ఈ ప్రాంతంలో కొత్తగా వచ్చే పరిశ్రమలకి నేడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా వచ్చే నీటిని పరిశ్రమలకి ఇవ్వాలని సూచన చేశారు. ఆందోళనకారుల పై దాడులను, నిర్భంధాలను, అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియచేశారు. పేదలకి చెందాల్సిన పరిహారంలో అవకతవకలు జరిగాయని అనేక ఆరోపణలు వచ్చాయని దీనిపై తగు న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, సహాయ కార్యదర్శి బుగత అశోక్, అలమండ ఆనందరావులు పాల్గొన్నారు.

Exit mobile version